ఢిల్లీలో కాలుష్యం... విద్యా సంస్థలు, కార్యాలయాల మూసివేత...

ABN , First Publish Date - 2021-11-14T00:03:35+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమవడంతో

ఢిల్లీలో కాలుష్యం... విద్యా సంస్థలు, కార్యాలయాల మూసివేత...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమవడంతో సోమవారం నుంచి పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వోద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించారు. భవన నిర్మాణ కార్యకలాపాలను నిలిపేశారు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల నుంచి ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా ఉండటంతో సోమవారం నుంచి పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్యకలాపాలను నిలిపేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఆంక్షలు వారం రోజులపాటు అమలవుతాయన్నారు.


నగరంలో కాలుష్యం పరిస్థితి మరింత దయనీయంగా మారితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చిందన్నారు. తాము ఓ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామని, దీనిపై సంబంధిత సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తే,  భవన నిర్మాణం, వాహనాల సంచారం పూర్తిగా నిలిపేయవలసి ఉంటుందని చెప్పారు. 


కాలుష్యం సమస్యను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రయత్నాల కన్నా తక్షణం, అత్యవసరంగా స్పందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. దీంతో కేజ్రీవాల్ స్పందించారు. నగరంలో లాక్‌డౌన్ విదించడంపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-14T00:03:35+05:30 IST