సైట్ లో సాంకేతిక లోపం... రూ. 40వేలు చెల్లించిన అమెజాన్...
ABN , First Publish Date - 2021-01-21T23:37:17+05:30 IST
సైట్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఓ వినియోగదారునికి అమెజాన్ సంస్థ నష్టపరిహారంగా రూ. 45వేలు చెల్లించాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
భువనేశ్వర్ : సైట్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఓ వినియోగదారునికి అమెజాన్ సంస్థ నష్టపరిహారంగా రూ. 45వేలు చెల్లించాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014 లో అమెజాన్లో ఓ ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ. 23,499 విలువైన ల్యాప్టాప్ కేవలం రూ.190 కే ఆఫర్ కింద అందుబాటులో ఉండడంతో... ఆర్డర్ చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్ సర్వీసును సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీస్ విభాగం... సాంకేతిక సమస్య కారణంగా తక్కువ ధర చూపించిందని, ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నామని తెలిపారు.
దీంతో మహాపాత్ర... ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్టాప్ అవసరమున్న నేపధ్యంలో, రూ. 190 కే ల్యాప్టాప్ అని చూసి, ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇందుకు సంబంధించిన విచారణ తాజాగా ముగిసింది. ఆర్డర్ రద్దు చేసినందుకుగాను బాధితుడికి నష్ట పరిహారం కింద రూ. 40 వేలు, ఖర్చుల కింద మరో రూ. 5వేలను అమెజాన్ చెల్లించాలని ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీర్పునిచ్చింది.