భారత్కు బాసటగా అమెరికా బలగాలు !
ABN , First Publish Date - 2020-07-08T13:48:35+05:30 IST
య్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అమెరికా షాకిచ్చే ప్రకటన చేసిం ది. ఘర్షణపడే పరిస్థితి వస్తే తమ సైన్యం భారత్కు బాసటగా ఉంటుందని తేల్చిచెప్పింది.
తేల్చి చెప్పిన అమెరికా వైట్ హౌస్
యుద్ధ నౌకల మోహరింపుపైనా వివరణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్, జూలై 7: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అమెరికా షాకిచ్చే ప్రకటన చేసిం ది. ఘర్షణపడే పరిస్థితి వస్తే తమ సైన్యం భారత్కు బాసటగా ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘చైనాది సామ్రాజ్యవాద ధోరణి. ఇతర దేశాల భూభాగాలపై, దక్షిణ/తూర్పు చైనా సముద్రాలపై కన్నేసింది. ఇప్పటికే కొన్ని దీవులను, తీర ప్రాంతాలను హస్తగతం చేసుకుంది. ఆ చర్యలను ఉపేక్షించేది లేదు’’ అని వైట్హౌస్ ఉన్నతాధికారి మార్క్ మెడోస్ తెలిపారు. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను మోసుకెళ్లే రెండు భారీ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించడం, అక్కడ విన్యాసాలు చేయడంపైనా ఆయన స్పందించారు. వివాదాస్పద ప్రదేశంలో తమ ఉనికి ఉందని చెప్పడమే దానికి సంకేతమని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో మెడోస్ వ్యా ఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాయా్పలను భారత్ నిషేధించడంపై స్పందిస్తూ.. ‘‘భారత సైనికులను చైనా హతమార్చింది. అందుకే చైనాయాప్ లను బ్యాన్ చేశారు’’ అన్నారు. త్వరలో చైనాపై మరిన్ని ఆంక్షలను విధించే దిశలో ట్రంప్ ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఇప్పటి దాకా చైనా ఆర్థికంగా ఎదగడానికి అమెరికా దోహదపడింది. దాన్ని ఆ దేశం దుర్వినియోగం చేసుకుంది. ఇకపై ఆ సహకారం ఉండదు’’ అని వివరించారు. రిపబ్లిక్ పార్టీ సెనేటర్ టామ్ కాటన్ కూడా భారత్కు అమెరికా దన్నుగా ఉంటుంద ని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా విషయంలో తమ థియరీని మార్చబోతున్నామని, ఉత్పాదక రంగంలో ఆ దేశంపై ఆధారపడబోమని చెప్పారు. ఆస్ట్రేలియా కూడా ‘‘చైనాలో విదేశీయులను ఏకపక్షంగా నిర్బంధించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా జాతీయులెవరూ ఆ దేశానికి వెళ్లకూడదు’’ అని ట్రావెల్ అలెర్ట్ జారీచేసింది. కాగా.. అమెరికాలోని భారతీయులు చైనాకు వ్యతిరేకంగా కొత్తఉద్యమాన్ని ప్రారంభించారు. ‘జైపూర్ ఫూట్ యూఎ్సఏ’ చైర్మన్ ప్రేమ్ భండారీ నేతృత్వంలో చైనా సామ్రాజ్యవాద వ్యతిరేక గ్రూప్-23(ఓసీఐజీ-23) ఏర్పాటైంది. చైనాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కూడా చైనా వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నీలం, జీలం నదులపై చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా డ్యామ్ నిర్మాణాలకు వ్యతిరేకంగా ముజఫరాబాద్ నగర వాసులు భారీ ర్యాలీ చేపట్టారు. సోషల్ మీడియాలో కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ఎల్ఏసీ వద్ద రోడ్డు పనులు
లద్దాఖ్లో భారత్-చైనా సరిహద్దులైన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద రోడ్డు నిర్మాణ పనులను భారత్ వేగవంతం చేసింది. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ లద్దాఖ్ వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. సోమవారం చైనా వెనక్కి తగ్గడంతో అధికారులు రోడ్డుపనులను వేగవంతం చేశారు. గల్వాన్, చుశూల్, షైయాక్, దేమ్ చోక్, చుముర్ ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఎల్ఏసీ సమీపంలోని పలు ప్రాం తాల్లోనూ 30 బ్రిడ్జిల నిర్మాణం సాగుతోంది. ఇవి పూర్తయితే భారత సైనికులు ఎల్ఏసీని చేరడం మరింత సులభమవుతుంది.
గల్వాన్లో పెట్రోలింగ్కు సన్నాహాలు
లద్దాఖ్లో గల్వాన్ పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద పెట్రోలింగ్ను పునరుద్ధరించేందుకు భారతసైన్యం సన్నాహాలు చేస్తోం ది. చైనా దళాలు గత నెల 15న ఇదే ప్రాంతంలో భారత సైనికులపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఇరువైపులా సైన్యం వెనక్కి తగ్గాక.. పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద గస్తీని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. పాంగాంగ్ వద్ద మాత్రం ఇరువైపులా సైన్యాలు మోహరించే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్లో భారత వాయుసేన నిఘాను ముమ్మరం చేసింది. ప్రధానంగా రాత్రివేళల్లో వా స్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను గుర్తించేందుకు సరిహద్దుల వద్ద మిగ్, సుఖోయ్ యుద్ధవిమానాలు, అపాచీ హెలికాప్టర్లను మోహరించింది.
వెనక్కి తగ్గిన నేపాల్
డ్రాగన్ చెప్పుచేతల్లో ఉంటూ భారత్పై కారాలుమిరియాలు నూరిన హిమాలయ దేశం నేపాల్ వెనక్కి తగ్గింది. గత నెల భారత్- నేపాల్ సరిహద్దుల్లోని కాలాపానీ తనదేనంటూ ఓలీ ప్రభుత్వం కొత్త రాజకీయ మ్యాపును విడుదలచేసి, వివాదానికి తెరతీసిన విష యం తెలిసిందే. గల్వాన్లో చైనాకు భారత్ గట్టి బుద్ధి చెప్పడం.. తదనంతర పరిణామాలతో నేపాల్ కాలాపానీలోని రెండు చెక్ పోస్టులను తొలగించింది.
ప్రకటనలో గల్వాన్ పేరు ఏదీ: రాహుల్
ఎల్ఏసీ వద్ద చైనా, భారత్ సైన్యాలు వెనక్కి తగ్గినట్లు విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలో గల్వాన్ పేరును ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
మన సరిహద్దుల్లో చైనా విమానాలు?
గత శుక్రవారం ప్రధాని మోదీ లద్దాఖ్లోదిగినప్పుడే చైనాకు చెందిన యుద్ధ విమానాలు మన గగనతలంలోకి దూసుకొచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండవ హెచ్చరిక తర్వా త కూడా చైనా విమానాలు ముందుకు రావడంతో క్షణాల్లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ విమానాలు రంగప్రవేశం చేశాయి. చైనా విమానాలనుచుట్టుముట్టాయి. దీంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ సమాచారాన్ని భారత రక్షణ వర్గాలు అత్యంత రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని లద్దాఖ్ పర్యటన సమాచారం అత్యంత రహస్యంగా ఉంచినప్పటికీ చైనాకు ఎలా తెలిసిందనేది చర్చనీయాంశమవుతోంది.