HYD : పెళ్లి పనుల్లో బిజీ.. America లో ఉంటున్న అన్నతో వీడియో కాల్ మాట్లాడుతూ బిల్డింగ్ పైకి వెళ్లి..
ABN , First Publish Date - 2021-07-18T18:32:17+05:30 IST
అమెరికాలోని సోదరుడికి అనుకూలమైన సమయం కావడంతో..
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : వీడియో కాల్ మాట్లాడుతూ రెండంతస్తుల భవనంపై నుంచి పడి అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చింతకాయల వెంకటేష్ తెలిపిన వివరాలు.. తాళ్లూరి సామ్యూల్ సుజిత్ (32) ప్రైవేట్ ఉద్యోగి. కుటుంబంతో కలిసి మణికొండలోని గార్డెన్ ఏరియా ప్రాంతంలో ఉంటున్నాడు. భార్య నాలుగు నెలల గర్భవతి. ఆమె తన తల్లిగారిల్లు ఉన్న తాడేపల్లిగూడెంకు వెళ్లింది. సుజిత్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అమెరికాలో ఉంటున్న తన సోదరుడు సుప్రియ అభిషేక్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అమెరికాలోని సోదరుడికి అనుకూలమైన సమయం కావడంతో శనివారం వేకువజామున 5.40 గంటల సమయంలో అతడితో వీడియో కాల్ మాట్లాడుతూ రెండంతస్తుల భవనం బాల్కనీపైకి వచ్చాడు. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. పక్క ఇంటి వారు గమనించి, కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుశీల్ భాగ్యరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.