ఒమైక్రాన్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన అమెరికా

ABN , First Publish Date - 2021-12-04T23:21:32+05:30 IST

కొత్త కరోనా వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది.

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన అమెరికా

కొత్త కరోనా వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంది. వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చే వారి కోసం కఠిన నిబంధనలు విధించింది. ఈ కొత్త రూల్స్ కారణంగా స్వదేశానికి చేరుకోవాలనుకుంటున్న అమెరికన్లకూ ఇక్కట్లు తప్పవనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. వచ్చే వారం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఆదేశించారు. 


1. కొత్త రూల్స్ ప్రకారం.. కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిన వారినే  అమెరికాలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో అమెరికా ప్రయాణానికి ఒక రోజు ముందు చేయించుకున్న కరోనా టెస్టునే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. తమకు పరీక్షలో నెగెటివ్ వచ్చినట్టు ప్రయాణికులు అన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమెరికన్లకూ వర్తిస్తుంది. 


2. విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అయితే.. జనవరితో ఈ మాస్కు నిబంధన గడువు ముగుస్తుండటంతో దీన్ని మరింతకాలం పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 


3. నిబంధనలు అతిక్రమించే వారిపై భారీ జరిమానాలు విధించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. బహిరంగ ప్రదేశాల్లో, ప్రజారవాణా వినియోగించే సమయాల్లో మాస్కు పెట్టుకోని వారిపై 500 నుంచి 3 వేల డాలర్లకు వరకూ జరిమానా విధిస్తారు. భారత కరెన్సీ ప్రకారం.. గరిష్టంగా రూ. 2.25 లక్షల వరకూ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. 


4. ఇక అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికాలో విమానం దిగాక తప్పనిసరిగా క్వారంటైన్‌కు పరిమితవవ్వాలి. కరోనా టెస్టు నెగెటివ్ రిపోర్టు ఉన్నా క్వారంటైన్ తప్పనిసరేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 



Updated Date - 2021-12-04T23:21:32+05:30 IST