Ambulance Accident: టోల్బూత్ను ఢీ కొట్టిన అంబులెన్స్.. షాకింగ్ వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-07-21T01:45:30+05:30 IST
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వెళ్తున్న అంబులెన్స్ టోల్బూత్ను ఢీకొట్టింది.
కర్ణాటకలోని ఉడిపీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వెళ్తున్న అంబులెన్స్ టోల్బూత్ (Toll booth)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మరణించారు. ఉడిపీ జిల్లాలోని కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. జోరు వర్షంలో కూడా ఆ అంబులెన్స్ వేగంగా ప్రయాణిస్తోంది. అంబులెన్స్ రాకను గమనించిన టోల్ బూత్ సిబ్బంది ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించి ప్రత్యేక లైన్లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు.
అతి వేగంగా వస్తున్న అంబులెన్స్ తడిసి ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. చక్రాలు జారిపోవడంతో అంబులెన్స్ టోల్ బూత్ క్యాబిన్ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి అంబులెన్స్లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడి మరణించారు. అలాగే అంబులెన్స్ ఢీకొట్టడంతో టోల్ బూత్లో పని చేసే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.