కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ సెప్టెంబరు నుంచి ప్రారంభం : అంబికా సోనీ

ABN , First Publish Date - 2021-10-16T21:53:23+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ 2022 సెప్టెంబరులో

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ సెప్టెంబరు నుంచి ప్రారంభం : అంబికా సోనీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సమైక్యంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. 


సీడబ్ల్యూసీ సమావేశంలో జీ23 నేతల ప్రస్తావన రాలేదని చెప్పారు. వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. వర్గాలుగా కాంగ్రెస్ విడిపోలేదని, తామంతా సమైక్యంగా ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలంతా ఏకగ్రీవంగా కోరినట్లు తెలిపారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంపై నిర్ణయం తీసుకోవలసినది రాహుల్ గాంధీయేనని చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందన్నారు. 


నేనే ప్రెసిడెంట్‌ని : సోనియా

న్యూఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘‘నేను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్ అధ్యక్షురాలిని’’ అని తెలిపారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే, మీడియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం లేదని తెలిపారు. మనమంతా కలిసి స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందామన్నారు. ఈ గది నాలుగు గోడల వెలుపల తెలియజేయవలసినది సీడబ్ల్యూసీ సమష్టి నిర్ణయమని చెప్పారు. 


కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్‌గఢ్), చరణ్‌జిత్ చన్ని (పంజాబ్) ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 


గత ఏడాది ఆగస్టులో సీనియర్ల లేఖ

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీకి చెందిన  23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేశారు. గత నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు ప్రెసిడెంట్ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. వెంటనే సీడబ్ల్యూసీని సమావేశపరచాలని కోరారు. గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. ఈ 23 మంది నేతలను జీ23 నేతలని పిలుస్తున్నారు.


Updated Date - 2021-10-16T21:53:23+05:30 IST