వెంటిలేటర్ సాయంతో డీఎంకే నేత అంబజగన్కు చికిత్స
ABN , First Publish Date - 2020-06-05T02:39:37+05:30 IST
తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే జే అంబజగన్ (61)కు వెంటిలేటర్ సాయంతో
చెన్నై : తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే జే అంబజగన్ (61)కు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నారు. ఆయన కోవిడ్-19 పాజిటివ్ అని బుధవారం నిర్థరణ అయిన సంగతి తెలిసిందే.
చెన్నైలోని క్రోమ్పేటలో ఉన్న డాక్టర్ రీలా ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో అంబజగన్కు చికిత్స జరుగుతోంది. ఆయన తనకు అవసరమైన ఆక్సిజన్లో 80 శాతం వెంటిలేటర్ ద్వారానే తీసుకుంటున్నారని ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆయనకు కోవిడ్-19 సోకినట్లు పేర్కొంది. ఆయనకు మొదట్లో ఫేస్మాస్క్ ద్వారా ఆక్సిజన్ థెరపీ చేసినట్లు, ఆ తర్వాత వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపింది. గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని పేర్కొంది.
అంబజగన్ చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి 2016 శాసన సభ ఎన్నికల్లో గెలిచారు. దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
రెండు దశాబ్దాల క్రితం ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది. ఇటీవల కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆయన స్వయంగా ఐసొలేషన్లో గడిపారు. బుధవారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది.