అతి తీవ్ర తుపానుగా మారుతున్న ‘నివర్’
ABN , First Publish Date - 2020-11-25T14:37:47+05:30 IST
రాష్ట్రానికి ‘నివర్’ తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారిన ‘నివర్’..రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ
అమరావతి: రాష్ట్రానికి ‘నివర్’ తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారిన ‘నివర్’..రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఐఎండీ సూచనల ప్రకారం నివర్ కడలూర్కు తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకావం ఉంది.
నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు.