త్యాగాలను అవహేళన చేస్తారా..?
ABN , First Publish Date - 2020-07-06T09:36:02+05:30 IST
అమరావతి లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని రాజధాని రైతులు ప్రశ్నించారు. తమ త్యాగాలను అవహేళన చేయొద్దంటూ హితవు పలికారు.
201వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
గుంటూరు, ఆంధ్రజ్యోతి : అమరావతి లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని రాజధాని రైతులు ప్రశ్నించారు. తమ త్యాగాలను అవహేళన చేయొద్దంటూ హితవు పలికారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 201వ రోజుకు చేరాయి. దేశ, విదేశాల నుంచి తమకు మద్దతు తెలిపిన వారికి అమరావతి రైతులు వివిధ మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 29 గ్రామాల్లో రైతులు, మహిళలు, కూలీలు మహాదీక్ష పేరుతో అమరావతి నినాదాన్ని హోరెత్తించారు. రైతుల పోరాటానికి రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. తుళ్లూరు, దొండపాడుతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘ఇంటిటా అమరావతి’ పేరుతో రైతులు, మహిళలు బృందాలుగా ఏర్పడి దీక్షలు కొనసాగించారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం అమరావతి మహిళలు షిర్డిసాయి పారాయణం పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా నిరసనలు కొనసాగించారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు ఇళ్లలో విద్యుత్ను ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు.