త్యాగాలను అవహేళన చేస్తారా..?

ABN , First Publish Date - 2020-07-06T09:45:21+05:30 IST

అమరావతి లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని రాజధాని రైతులు ప్రశ్నించారు. తమ త్యాగాలను అవహేళన చేయవద్దంటూ..

త్యాగాలను అవహేళన చేస్తారా..?

అమరావతి అభివృద్ధి చేయకుండా సంక్షేమం సాధ్యమా...?

201వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): అమరావతి లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని రాజధాని రైతులు ప్రశ్నించారు. తమ త్యాగాలను అవహేళన చేయవద్దంటూ హితవు పలికారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 201 రోజులకు చేరాయి. దేశ, విదేశాల నుంచి తమకు మద్దతు తెలిపిన వారికి అమరావతి రైతులు వివిధ మాద్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 29 గ్రామాల్లో రైతులు, మహిళలు, కూలీలు మహాదీక్ష పేరుతో అమరావతి నినాదాన్ని హోరెత్తించారు. రైతుల పోరాటానికి రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. తుళ్లూరు, దొండపాడుతో పాలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులకు వెల్లువెత్తుతున్న మద్దతు చూసైనా రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సీపీఐ నాయకులు కోరారు. అలానే ఇంటిటా అమరావతి పేరుతో రైతులు, మహిళలు బృందాలుగా ఏర్పడి దీక్షలు కొనసాగించారు.


ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని అమరావతి మహిళలు షిరిడీ సాయి పారాయణం పఠించి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేలా చూడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలోనే రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. అలానే అమరావతి వెలుగు కార్యక్రమం కింద ఇళ్లలో రాత్రి 7.30 గంటలకు రైతులు ఇళ్లలో విద్యుత్‌ను ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ జై అమరావతి, సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2020-07-06T09:45:21+05:30 IST