అమరావతి: జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో పోలీసుల చర్యల్ని ఖండిస్తున్నామన్నారు. పోస్టర్ చించిన కేసులో గ్రామంలో లేని వారిని అరెస్ట్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని కోర్టుకు హాజరు పర్చకపోవడం ఏ చట్టంలో ఉందని నిలదీశారు. పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా.. వైసీపీకి ఊడిగం చేస్తున్నారా అని మండిపడ్డారు. పోస్టర్ చించితే అరెస్ట్ చేసిన పోలీసులు.. దాడికి దిగిన వారినెందుకు అరెస్టు చేయరన్నారు. అరెస్ట్ అయిన కార్యకర్తలకు ఏం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని... తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.