వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2020-04-03T08:53:39+05:30 IST
వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ
స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబైలో 600 మంది కర్నూలు వాసులకు ఊరట
కర్నూలు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): తూర్పు ముంబైలోని వర్సోవా ప్రాంతానికి కర్నూలు జిల్లా నుంచి వలస వెళ్లిన 600 కుటుంబాలు లాక్డౌన్ కారణంగా దాదాపు వారానికి పైగా ఆకలితో అలమటిస్తున్నాయి. వారి పరిస్థితిని తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లాలోని దాదాపు 11 మండలాల నుంచి ముంబై వెళ్లిన వలస కూలీలు పడుతోన్న ఇబ్బందులపై ‘కడుపు కొట్టిన కరోనా’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో గురువారం కథనాన్ని ప్రచురించింది. పీపుల్స్ యాక్షన్ ఫోరం అధ్యక్షుడు సురేశ్.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూలీల కష్టాలను ఈ-మెయిల్ ద్వారా విన్నవిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని కూడా పంపారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, ఐదు కిలోల బియ్యం, రెండు కిలోల గోధుమ పిండి, దుస్తులు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చింది.