రఘురామ కృష్ణంరాజు అరెస్ట్‌ను తప్పుబట్టిన అమరావతి రైతులు

ABN , First Publish Date - 2021-05-15T17:42:49+05:30 IST

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన విధానాన్ని అమరావతి రైతులు తప్పుబట్టారు.

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్‌ను తప్పుబట్టిన అమరావతి రైతులు

అమరావతి: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన విధానాన్ని అమరావతి రైతులు తప్పుబట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏపీలో లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదా అని నిలదీశారు. మంత్రి కొడాలి నాని, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతకన్నా దారుణంగా మాట్లాడారని... వీర్నెందుకు అరెస్ట్ చేయలేదని రైతులు మండిపడ్డారు. రాజధాని అమరావతికి ఎవరు అనుకూలంగా మాట్లాడినా వారిపై ఈ ప్రభుత్వం కక్షగడుతోందన్నారు. తుళ్లూరు మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కావాలనే ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహిస్తోందని విమర్శించారు. వ్యాక్సిన్లు వచ్చినా వాటిని పూర్తిగా వేయకుండా వేరే చోటకు తరలిస్తోందని ఆరోపించారు.


రాజధాని గ్రామాల్లో ఎక్కడా గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ రాష్ట్ర పౌరులం కాదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు 18 సంవత్సరాలు ఉన్న వ్యాక్సిన్ వేస్తున్నారని... వేరేవాళ్లకు మాత్రం వ్యాక్సిన్ అందనివ్వడం లేదన్నారు. ఎక్కడో ఉన్న లోకేష్ ఏయిమ్స్‌లో వ్యాక్సినేషన్‌కు ప్రయత్నం చేస్తే అది కూడా జరగకుండా చేసారని రైతుల ఆవేదన  చెందారు. వ్యాక్సిన్ విషయంలో కూడా రాజకీయం చేయడం తగదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-15T17:42:49+05:30 IST