అడుగడుగునా ఒప్పందాల ఉల్లంఘన!
ABN , First Publish Date - 2020-04-04T07:34:52+05:30 IST
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే.. అధికారంలో ఉన్న మానసిక రోగితోనే ఈ సమాజానికి ఎక్కువ ప్రమాదమని అమరావతి ప్రాంత రైతులు...
- కరోనా కంటే అధికారంలో ఉన్న మానసిక రోగితో ప్రమాదం
- 108వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే.. అధికారంలో ఉన్న మానసిక రోగితోనే ఈ సమాజానికి ఎక్కువ ప్రమాదమని అమరావతి ప్రాంత రైతులు అన్నారు. ఈ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలను అడుగడుగునా ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు 108వ రోజూ కొనసాగాయి.
ఇంటింటా మార్మోగిన నినాదాలు..
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో రైతులు ఎవరి ఇంట్లో వారు కూర్చొని అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సమేతంగా ఆందోళన కొనసాగించారు.
వార్తా ప్రసారాల్లో కనిపిస్తే ఖబర్దార్..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా రాజధాని గ్రామాల్లో ఆంక్షలు శుక్రవారం మరింత కఠినతరం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులు కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో ఉద్యమం కొనసాగించడం సరికాదన్నారు. వార్తప్రసారాల్లో, వార్తా పత్రికల్లో కనపడిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కొనసాగించిన ‘అమరావతి వెలుగు’
రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ రాత్రి 7.30 గంటలకు విద్యుత్ నిలిపి కొవ్వుతులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు చేస్తున్న నిరసన ప్రదర్శన శుక్రవారం కూడా కొనసాగింది. రాత్రి 7.30 నుంచి 7.35 వరకు గ్రామ కూడళల్లో మహిళలు, రైతులు కొవ్వొత్తులు పట్టుకొని నిలబడి ‘జై అమరావతి’ నినాదాలు చేశారు.