రైతులకు ఇచ్చే భరోసా ఇదేనా?
ABN , First Publish Date - 2022-05-18T05:28:24+05:30 IST
అమరావతి రాజధాని రైతులను రోడ్డుపై నిలబెట్టడమే మీరు చ్చే భరోసానా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
882వ రోజుకు చేరుకున్న ఆందోళనలు
తుళ్ళూరు, మే 17: అమరావతి రాజధాని రైతులను రోడ్డుపై నిలబెట్టడమే మీరు చ్చే భరోసానా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, హైకోర్టు తీర్పును అమలు చేసి రాజధాని అభివృద్ధిని పూర్తి చేయాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేపట్టిన ఆందోళనలు మంగళవారం 882 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతులను మూడు రాజధానుల పేరుతో అన్యాయం చేశారని ఆరోపించారు. అమరావతి రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి మూడు ముక్కల ఆటతో సీఎం జగన్రెడ్డి అభివృద్ధి లేకుండా చేయటం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో పలు సంస్థలకు స్థలాలున్నాయని, వాటిల్లో నిర్మాణాలు చేయాలని కోరారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. వెలగపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, దొండపాడు, వెంకటపాలెం తదితర రాజధాని గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.