ప్రభుత్వం మారితే విధానాలు మారుతాయా?
ABN , First Publish Date - 2022-05-17T05:20:54+05:30 IST
ప్రభుత్వం మారినంత మాత్రాన మునుపటి ప్రభుత్వం తీసుకున్న విధానాలు మారతాయా అని రాజధాని రైతులు ధ్వజమెత్తారు.
881వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు ధ్వజం
తుళ్లూరు, మే 16: ప్రభుత్వం మారినంత మాత్రాన మునుపటి ప్రభుత్వం తీసుకున్న విధానాలు మారతాయా అని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు సోమవారానికి 881వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారితే అభివృద్ధి సున్నా అవుతుందన్నారు. ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామంటేనే తాము భూములు ఇచ్చామే కాని ఇలా పాడుబెట్టడానికి కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూములు ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా అమరావతిని నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని రాజకీయాలకు వేదికగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతిని అబివృద్ధి చేసి హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించాలన్నారు. రాజధాని 29 గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.