అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: సీహెచ్ బాబూరావు
ABN , First Publish Date - 2021-08-08T18:57:20+05:30 IST
విజయవాడ: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు, ప్రజలు చేపట్టిన ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసన ర్యాలీ చేపట్టారు.
విజయవాడ: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు, ప్రజలు చేపట్టిన ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసన ర్యాలీ చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, ప్రజలకు మద్దతు తెలిపిన బాబూరావు మాట్లాడుతూ.. ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం శోచనీయమన్నారు. అంతటితో ఆగకుండా అన్ని గ్రామాల్లో వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయించడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి.. శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. అంతే కాకుండా మీడియాపై కూడా ఆంక్షలు విధించడం నిర్బంధానికి పరాకాష్ట అని విమర్శించారు. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం మాట తప్పి.. ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం.. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. కనీసం అమరావతిని గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై.. మొండివైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులు, ప్రజలందరినీ విడుదల చేయాలని, శాంతియుత ఆందోళనలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.