రాజధాని లేకుండా పాలన
ABN , First Publish Date - 2022-01-27T04:54:42+05:30 IST
అమరావతిని నిర్వీర్యం చేశారు.. మూడు రాజధానులన్నారు.. చివరకు రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్రెడ్డి పాలన సాగిస్తున్నారని రైతులు తెలిపారు.
771వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు
రైతు ధర్నా శిబిరాల వద్ద జెండా వందనం
తుళ్లూరు, జనవరి 26: అమరావతిని నిర్వీర్యం చేశారు.. మూడు రాజధానులన్నారు.. చివరకు రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్రెడ్డి పాలన సాగిస్తున్నారని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు 771వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తున్న ప్రభుత్వం, రాజధాని లేని రాష్ట్రంగా ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా రాజధాని లేని రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. తొలుత రాజధాని పేరు చెప్పి జిల్లాలను విభజించాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయకపోవడంతో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదన పక్కన పెట్టి అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు ధర్నా శిబిరాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు.