ఈ ఏడాది రూ.700 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2022-05-27T07:37:46+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమరరాజా బ్యాటరీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
రెండేళ్లలో లిథియం అయాన్ సెల్ ప్లాంట్ రెడీ
కంపెనీల కొనుగోళ్లపై ఆసక్తి: అమరరాజా బ్యాటరీస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమరరాజా బ్యాటరీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ద్విచక్ర, కార్ల బ్యాటరీల సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇప్పటికే కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఇందులోభాగంగా సామర్థ్యాల విస్తరణ, బ్యాటరీల రీసైక్లింగ్ ప్లాంట్, లిథియం అయాన్ సెల్ యూనిట్ (60-70 మెగావాట్లు)పై ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు రూ.760 కోట్ల పెట్టుబడులు పెట్టింది. బ్యాటరీల రీసైక్లింగ్ ప్లాంట్ 18-20 నెలల్లో పూర్తి కాగలదని, ద్విచక్ర, కార్ల బ్యాటరీల విస్తరణ సామర్థ్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అందుబాటులోకి వస్తాయని కంపెనీ భావిస్తోంది. కాగా లిథియం అయాన్ సెల్ ప్లాంట్ కూడా రెండేళ్లలో సిద్ధం కానుందని పేర్కొంది.
వచ్చే ఐదేళ్లలో..
భాగస్వామ్యాలు, సంయుక్త సంస్థల ఏర్పాటు, కొనుగోళ్లు మొదలైన వాటి ద్వారా వచ్చే ఐదేళ్లలో ఏటా ఆదాయంలో 15-17 శాతం వృద్ధి నమోదు చేయాలని అమరరాజా లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని విభాగాల్లో బ్యాటరీల డిమాండ్ బాగా ఉండే సంకేతాలు అందుతున్నప్పటికీ.. ముడి పదార్థాల వ్యయాలు పెరగడం మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు కంపెనీ పేర్కొంది. అమరరాజా బ్యాటరీస్ దాదాపు 35 దేశాల్లో బ్యాటరీలను విక్రయిస్తోంది. మొత్తం ఆదాయంలో 12 శాతం ఎగుమతుల నుంచి లభిస్తోంది. కొత్త ఎనర్జీ విభాగాల్లోకి కంపెనీ వేగంగా ప్రవేశిస్తున్నందున దేశీయ ఆదాయంలో వృద్ధి రేటు కన్నా ఎగుమతుల ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఉంటుందని భావిస్తోంది. కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా విదేశీ మార్కెట్లలో విస్తరించే అంశాన్ని పరిశీలిస్తోంది.
దావో్సలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే 5-10 ఏళ్లలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడానికి 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు అమరరాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ టెక్నాలజీల్లో పరిశోధనలు చేస్తున్న అనేక దేశ, విదేశీ స్టార్ట్పలో అమరరాజా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.