Davos World Economic Forum: లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో బిలియన్ డాలర్ల పెట్టుబడి: గల్లా జయదేవ్
ABN , First Publish Date - 2022-05-27T02:23:04+05:30 IST
అమరరాజా గ్రూప్ సహ వ్యస్థాపకుడు, చైర్మన్, టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక
న్యూఢిల్లీ: అమరరాజా గ్రూప్ సహ వ్యస్థాపకుడు, చైర్మన్, టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ మార్పుల వల్ల వాటిల్లుతున్న నష్టాలు, విద్యుత్ సంక్షోభం, విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అమరరాజా ప్రయాణం తదితర విషయాలపై మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నారు.
ఈ నేపథ్యంలో అమరరాజా గ్రూప్ దేశంలోను, విదేశాల్లోనూ పలు నూతన ఎనర్జీ స్టార్టప్స్లలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు వచ్చే 5-10 సంవత్సరాల్లో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక రచించినట్టు చెప్పారు.
చమురు ధరలు పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు మొదలు విద్యుత్, ఆహార ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయని జయదేవ్ గల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా గతం కంటే మిన్నగా విద్యుత్ భద్రత కావాల్సి ఉందన్నారు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరరాజా గ్రూప్గా తాము స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని, భారదేశపు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉందని జయదేవ్ గల్లా పేర్కొన్నారు.