సంచరించని వాహనం..లక్షలు వెచ్చించారు.. వినియోగం మరిచారు
ABN , First Publish Date - 2020-11-04T09:49:46+05:30 IST
ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సంచార వైద్యశాల వాహనం నిరుపయోగంగా పడిఉంది. ఏళ్లకాలంగా వినియోగించక చెట్లకిందే ఉంచడంతో వాహనం తుప్పు పడుతోంది
ఆమనగల్లులో మూలనపడిన సంచార వైద్యశాల వాహనం
ఏళ్ల నుంచి నిరుపయోగంఫ తుప్పు పడుతున్న వైనం
మరమ్మతు చేసి సేవలు ప్రారంభించాలంటున్న స్థానికులు
ఆమనగల్లు : ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సంచార వైద్యశాల వాహనం నిరుపయోగంగా పడిఉంది. ఏళ్లకాలంగా వినియోగించక చెట్లకిందే ఉంచడంతో వాహనం తుప్పు పడుతోంది. దీంతో ప్రజాధనం వృథా అయి, ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. వాహనాన్ని మరమ్మతు చేసి వినియోగించాలన్న స్థానికుల విన్నపాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దశాబ్దం క్రితం ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలపరిధిలోని ప్రజలకు వైద్య సేవలందించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి సంచార వైద్య వాహనాన్ని కొనుగోలు చేశారు. కొంత కాలం పాటు ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో సంచార వైద్య సేవలు వాహనం ద్వారా అందించారు. అనంతరం నిర్వహణ లేక వాహనాన్ని నిరుపయోగంగా వదిలేశారు. నేడు చాలా వరకు తుప్పు పట్టిపోయింది. ఇప్పటికైనా వాహనాన్ని మరమ్మతు చేసి సంచార వైద్యసేవలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.