నేను సీఎంను, టెర్రరిస్టును కాను...
ABN , First Publish Date - 2022-02-15T16:22:59+05:30 IST
''నేను సీఎంను, టెర్రరిస్టును కాను'' అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ..
పఠాన్కోట్: ''నేను సీఎంను, టెర్రరిస్టును కాను'' అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటన సందర్భంగా చండీగఢ్లో 'నో ఫ్లై జోన్' విధించడంతో చన్నీ హెలికాప్టర్ను టేకాఫ్ చేయడానికి అధికారులు అనుమతించ లేదు. దీంతో హోసియార్పూర్లో రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభకు చన్నీ హాజరు కాలేకపోయారు. దీనిపై చన్నీ మంగళవారంనాడు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ టెర్రరిస్టును కానని, తమ చేతుల్లో పంజాబ్ సురక్షితంగా ఉందని చెప్పారు.
''మధ్యాహ్నం 11 గంటలకు నేను ఉనాలో ఉన్నారు. అకస్మాత్తుగా ప్రధాని పర్యటన ఉన్నందున నో ఫ్లై జోన్ ప్రకటించామంటూ హోషియార్పూర్ వెళ్లేందుకు నాకు అనుమతి నిరాకరించారు. దీంతో హోషియార్పూర్లో రాహుల్ పర్యటనకు వెళ్లలేకపోయారు. ల్యాండ్ రూట్లో వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు'' అని చెప్పారు. పంజాబ్ తమదని, తమ చేతుల్లో పంజాబ్ సురక్షితంగా ఉంటుందని అన్నారు. తాను సీఎంనే కానీ, టెర్రరిస్టును కాదని, తనను హోషియార్పూర్ వెళ్లకుండా ఆపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలపై ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను ఉసికొల్పినా ఒరిగేది ఏమీ ఉండదని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు.