నాలుగు సార్లు గెలిచినా..ఐదేళ్ల పదవికి సోలిపేట దూరం
ABN , First Publish Date - 2020-10-01T09:53:30+05:30 IST
దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగుసార్లు గెలుపొంది చట్ట సభల్లోకి అడుగుపెట్టినా ఏ టర్మ్లో కూడా పూర్తిగా
దుబ్బాక, సెప్టెంబరు 30: దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగుసార్లు గెలుపొంది చట్ట సభల్లోకి అడుగుపెట్టినా ఏ టర్మ్లో కూడా పూర్తిగా ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదం వల్ల ఓసారి, ముందస్తు ఎన్నికల వల్ల రెండోసారి ఆయన ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా 2018లో గెలిచి, ఈ దఫా అయినా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటానని ఆశించినా విధి అందుకు సహకరించలేదు. రామలింగారెడ్డి తొలుత 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.
పదవీకాలం పూర్తికాకుండానే.. 2008లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదించిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు.. టీఆర్ఎస్ శాసనసభ్యులందరి చేతా రాజీనామా చేయించారు. ఆ వెంటనే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ దఫా రామలింగారెడ్డి గెలిచారు. మళ్లీ ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందినా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసే అవకాశం దక్కలేదు. నాలుగేళ్లలోపే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తిరిగి 2018 ఎన్నికల్లో గెలిచినా అకాల మరణంతో ఐదేళ్ల పదవీకాలానికి నోచుకోలేకపోయారు.