ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి
ABN , First Publish Date - 2021-10-19T05:58:48+05:30 IST
జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేస్తూ నూనెగింజల సాగుపై దృష్టిసారించాలని జాతీయ నూనె గిం జల సంస్థల డైరెక్టర్ ఎం.సుజాత సూచించారు.
నూనె గింజల సాగుపై రైతులు దృష్టి సారించాలి
జాతీయ నూనెగింజల సంస్థల డైరెక్టర్ ఎం.సుజాత
నిజామాబాద్ రూరల్, అక్టోబరు 18: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేస్తూ నూనెగింజల సాగుపై దృష్టిసారించాలని జాతీయ నూనె గిం జల సంస్థల డైరెక్టర్ ఎం.సుజాత సూచించారు. సోమవారం నగరంలోని 13వ డివిజన్ పరిధిలోగల సారంగపూర్ ఫ్యాక్టరీ ఆవరణలో రైతులకు ‘పంటల మార్పిడి విధానం-నూనె గింజల ఉత్పత్తి’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సుజాత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... రైతులు మూ స విధానానికి స్వస్తి చెబుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో నూనె గింజలకు విపరీతమైన డిమాండ్ ఉందని, భవిష్యత్తులో కూడా ఉంటుందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలని, అందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలన్నారు. రైతులు నూనె గింజ లు పెద్ద మొత్తంలో పండించడం వల్ల నూనెలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. రైతులు చేసే పనులు సమాజహితం కోసం ఉండాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్, డాక్టర్ సతీష్, డాక్టర్ జవహర్, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ ఈశ్వర్ రెడ్డి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, నూతన సాగువిధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎఆర్, ఐఐవోఆర్ బోర్డు సభ్యులు, ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొండల్సాయిరెడ్డి, ఫ్యాక్టరీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.