బ్యాంక్ ఎఫ్డీ, పోస్టాఫీస్ పథకాలకు ప్రత్యామ్నాయాలు..
ABN , First Publish Date - 2020-10-04T06:17:57+05:30 IST
అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి వడ్డీని యధావిధిగా కొనసాగించడం ఇది వరుసగా రెండోసారి...
అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి వడ్డీని యధావిధిగా కొనసాగించడం ఇది వరుసగా రెండోసారి. కానీ, బ్యాంకులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ (రెపో) రేట్లను తగ్గించుకుంటూ రావడమే ఇందుకు ప్రధాన కారణం. 2019 జనవరి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.50 శాతం తగ్గించింది. దాంతో బ్యాంకులు ఎఫ్డీలపై ఆఫర్ చేసే వడ్డీ రిటర్నులకు కోత పెట్టాయి. తత్ఫలితంగా బ్యాంకు ల ఫిక్స్డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం 0.40-0.60 శాతం స్థాయికి పెరిగింది.
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రస్తుతం ఏడాది కాలపరిమితి ఎఫ్డీపై 4.90 శాతం ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ 5.10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం వార్షిక రిటర్నును అందిస్తున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో పోస్టాఫీస్ పథకాలైన పీపీఎఫ్, టైమ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేటును ఏకంగా 1.40 శాతం వరకు తగ్గించింది. ఆ తర్వాత ఎలాంటి మార్పు చేయకపోయినప్పటికీ.. ఏడాది కాలానికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్పై లభించే వడ్డీ 5.5 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలపరిమితి టైమ్ డిపాజిట్పై వడ్డీ 6.7 శాతంగా ఉంది. ఐదేళ్ల డిపాజిట్లపై ఎస్బీఐ 5.40 శాతం, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ 5.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5.35 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఎఫ్డీ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్న తరుణంలో దీర్ఘకాలిక మదుపునకు బ్యాంక్ ఎఫ్డీలు, పోస్టాఫీస్ స్కీమ్లకు బదులు చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఎంచుకోవడం మేలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
రాబడులనిచ్చే పథకాలు
- ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పెట్టుబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. కాకపోతే వీటిపై లభించే వార్షిక వడ్డీ రేటు 7.15 శాతంగా ఉన్నందున బ్యాంక్ ఎఫ్డీల కంటే మెరుగే. అయితే, మెచ్యూరిటీకి ముందే వీటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఉన్న అవకాశాలు చాలా పరిమితం. జూలై 1 నుంచి ఈ బాండ్ల జారీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి కాలపరిమితి ఏడేళ్లు. ప్రతి ఆర్నెల్లకోసారి వడ్డీని సవరిస్తారు. జూలై 1 నుంచి డిసెంబరు 31 వరకు వడ్డీ రేటును 7.15 శాతంగా నిర్ణయించారు. 2021 జనవరి 1న ఆర్బీఐ వీటి ఇన్వెస్టర్లకు వడ్డీ చెల్లించనుంది. కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు.
- ఐదేళ్ల దీర్ఘకాలిక పెట్టుబడుల కోసమైతే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల (ఎన్ఎ్ససీ)ను ఎంచుకోవడం మేలు. ప్రస్తుతం ఎన్ఎ్ససీలపై వార్షిక వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. బ్యాంక్ ఎఫ్డీల కంటే కనీసం ఒక శాతం అధికం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకాని కంటే కూడా అధికం.
- వయోజనులైతేగనుక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎ్ససీఎ్సఎస్) లేదా ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) ఎంచుకోవడం ఉత్తమం. ఈ రెండింటిపై ఆఫర్ చేస్తోన్న వడ్డీ రేటు 7 శాతం పైనే.
- కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు ఎఫ్డీలపై 8-9 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ చెల్లిస్తున్నాయి. కాకపోతే, పెద్ద బ్యాంక్ ఎఫ్డీలతో పోలిస్తే వీటిలో మీ సొమ్ముకు భద్రత తక్కువే. రిస్క్ చేయగలిగే వెసులుబాటు ఉంటే, మీ పొదుపు సొమ్ములో కొంత మొత్తాన్ని వీటిలో డిపాజిట్ చేయవచ్చు.