వాస్తవాధీన రేఖ వెంట.. చెరో 60 వేల సైనిక దళాలు

ABN , First Publish Date - 2021-10-18T07:16:37+05:30 IST

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట భారత్‌-చైనాల సైనిక మోహరింపు రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం చెరో 60వేల సైనిక దళాలు ఎల్‌ఏసీకి ..

వాస్తవాధీన రేఖ వెంట.. చెరో 60 వేల సైనిక దళాలు

బలగాలను పెంచుతున్న భారత్‌-చైనా 

న్యూఢిల్లీ/మిసామారి, అక్టోబరు 17: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట భారత్‌-చైనాల సైనిక మోహరింపు రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం చెరో 60వేల సైనిక దళాలు ఎల్‌ఏసీకి ఇరువైపులా మోహరించి ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఎల్‌ఏసీకి అత్యంత సమీపంలో ఉండే కీలకమైన లేహ్‌ ప్రాంతంలోని భారత వైమానిక స్థావరాన్ని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి సందర్శించారు. దాని పరిధిలోని నార్తెర్న్‌ సెక్టార్‌లోకి వచ్చే ఫార్వర్డ్‌ ఏరియాల్లో వాయుసేన సంసిద్ధతపై ఆయన సమీక్షించారు. లేహ్‌లో మోహరించిన ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందితోనూ ఆయన సంభాషించారు. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్‌ సెక్టార్‌ పరిధిలోని ఎల్‌ఏసీ వద్ద భారత సైన్యం రాత్రి, పగలు గస్తీని ముమ్మరం చేసింది. గగనతల నిఘా కోసం ఇజ్రాయెల్‌ నుంచి కొన్న ‘హెరాన్‌’ డ్రోన్లను వినియోగిస్తోంది. ఇవి ఎల్‌ఏసీ పరిసరాల్లో చక్కర్లు కొడుతూ చైనా సైన్యం కదలికలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల వంటి ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత సైన్యం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు పంపిస్తున్నాయి. ఆయుధాలతో సశక్తమైన ‘రుద్ర’ హెలికాప్టర్లను కూడా ఎల్‌ఏసీ వద్ద గస్తీకి వాడుతున్నారు. 

Updated Date - 2021-10-18T07:16:37+05:30 IST