మద్యం షాపులను అనుమతించండి
ABN , First Publish Date - 2020-04-08T07:19:54+05:30 IST
మద్యం షాపులను అనుమతించండి
అక్రమ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి
ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల ఆందోళన
తెలంగాణ సహా 10 రాష్ట్రాల సీఎంలకు లేఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: మద్యం అమ్మకాలను అనుమతించాలని తెలంగాణ సహా పది రాష్ట్రాలకు భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) విజ్ఞప్తి చేసింది. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా మద్యం షాపులను మూసివేసినా చాలాచోట్ల మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హరియాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీబీఏబీసీ లేఖ రాసింది. మద్యంషాపుల మూసివేతతో తాగుడుకు అలవాటు పడినవారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, ఇది మున్ముందు శాంతిభద్రతలపైనా ప్రభావం చూపవచ్చని లేఖలో సీఐఏబీసీ డైర్టెకర్ జనరల్ వినోద్ గిరి పేర్కొన్నారు. లాక్డౌన్తో షాపులు మూసివేయించిన దృష్ట్యా మద్యం షాపుల లైసెన్సులను నెల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నిర్ణీత పని వేళలు, కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని షాపులను తెరిపించవచ్చని ఆయన సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సడలింపునిచ్చాయని గుర్తుచేశారు.