చింతపల్లి ఆస్పత్రికి స్థలం కేటాయింపు
ABN , First Publish Date - 2021-04-17T04:50:43+05:30 IST
చింతపల్లిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్టు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
చింతపల్లి, ఏప్రిల్ 16: చింతపల్లిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్టు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె ఐటీడీఏ అధికారులు ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించిన సెరీకల్చర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చింతపల్లిలో వంద పకడల ఆస్పత్రి నిర్మాణానికి రూ.25 కోట్లను ప్రభుత్వం గత ఏడాది మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. చింతపల్లిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం జరిగితే చింతపల్లి, జీకేవీధి మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే ఆస్పత్రికి కేటాయించిన సెరీకల్చర్ స్థలం సమీపంలోనున్న గిరిజనులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయాన్ని పాడేరు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకొని వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ డాక్టర్ డి. మహేశ్వరరావు, సర్పంచ్ దురియా పుష్పలత, వైసీపీ నాయకులు పోతురాజు బాలయ్య, జల్లి సుధాకర్ పాల్గొన్నారు.