మున్సిపల్ చైర్పర్సన్పై అవినీతి ఆరోపణలు
ABN , First Publish Date - 2022-05-27T05:01:27+05:30 IST
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అవినీతికి
- అదనపు కలెక్టర్ తనిఖీలు.. రికార్డులు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, మే 26: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ గురువారం సాయంత్రం ఇక్కడ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడ కౌన్సిలర్లతో సమావేశమై వివరాలు రాబట్టారు. అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. ఎజెండాలో పొందుపరచని వాటికి కౌన్సిల్ తీర్మానం చేసినట్లు, తప్పుడు రికార్డులు రాసి నిధులు డ్రా చేసినట్లు వారు అదనపు కలెక్టర్కు వివరించారు. అంతేగాక డీజిల్ బిల్లుల పేరున నెలనెలా ఎక్కువ నిధులు డ్రా చేశారని, మున్సిపల్ సిబ్బందితో ఇంట్లో సొంత పనులు చేయించుకుంటున్నారని కౌన్సిలర్లు అదనపు కలెక్టర్కు వివరించారు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగిందని దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో అదనపు కలెక్టర్ రికార్డులు స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ ఉన్నారు.