ముగిసిన అల్లాతాత చందనోత్సవం
ABN , First Publish Date - 2022-10-05T04:52:27+05:30 IST
వేనాడు దీవిలో వెలసిన షేక్ దావూద్షావలి అల్లాతాత 25వ చందనోత్సవం నిరాడంబరంగా జరిగింది.
తడ, అక్టోబరు 4 : వేనాడు దీవిలో వెలసిన షేక్ దావూద్షావలి అల్లాతాత 25వ చందనోత్సవం నిరాడంబరంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాబా సమాధిని ముస్లిం మతపెద్దలు శుద్ధిచేశారు. అనంతరం బాబాసమాధిని ప్రత్యేక చద్దరుతో అలంకరించారు. గంథాన్ని సిద్ధంచేసి దానిని శిరస్సుపై ఉంచుకొని బస్టాండ్ నుంచి దర్గా ప్రాంగణం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గంథాన్ని అల్లాతాత సమాధికి లేపనం చేసి గంథోత్సవాన్ని ముగించారు. ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని గ్రామసర్పంచ్ ఆధ్వర్యంలో హిందువులే నిర్వహించేవారు. అయితే ఈ సారి సర్పంచ్ వర్గం అధికారపార్టీ వర్గాలు గంథోత్సవానికి దూరంగా ఉండటంతో ముస్లిం మతపెద్దలే ఈ కార్యక్రమాన్ని ముగించారు. అలాగే ఈ ఏడాది గంథోత్సవానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ కుటుంబం హాజరుకాకపోగా, కడప పెద దర్గా నుంచి బాబాకు కానుకగా వచ్చే పూలు సైతం రాకపోవడం గమనార్హం.