పెద్దోళ్ల పెళ్లిలో సరదాగా గడిపారు.. పొద్దున చూస్తే ఆస్పత్రిలో ఉన్నారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-06T23:34:34+05:30 IST

గుజరాత్‌లో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేశారు. దీంతో అతిథులంతా ఆ పెళ్లికి క్యూ కట్టారు. పెళ్లిలో ఏర్పాట్లు చూసి అవాక్కయ్యారు..

పెద్దోళ్ల పెళ్లిలో సరదాగా గడిపారు.. పొద్దున చూస్తే ఆస్పత్రిలో ఉన్నారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తమ వివాహ కార్యక్రమం గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో డబ్బులున్న వాళ్లు.. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. సామాన్యులు కూడా వారికి ఉన్నంతలో శుభకార్యాలను ఘనంగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక కోటీశ్వరుల పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేస్తుంటారు. అలంకరణ మొదలుకొని భోజనాల వరకు ప్రతి విషయంలోనూ భారీగా ఖర్చు చేస్తుంటారు. అందుకే అలాంటి పెళ్లిళ్లకు ఆహ్వానం అందిన వెంటనే జనం వెళ్లేందుకు ఉత్సాహం చూపుతుంటారు. గుజరాత్‌లో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేశారు. దీంతో అతిథులంతా ఆ పెళ్లికి  క్యూ కట్టారు. పెళ్లిలో ఏర్పాట్లు చూసి అవాక్కయ్యారు. అతిథులంతా సరదా సరదాగా గడిపారు. అయితే తెల్లవారేసరికి అంతా ఆస్పత్రిలో చేరారు. సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌‌ రాష్ట్రం విస్నానగర్ తాలూకాలోని సావలగ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నేత ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి వేడుక జరిగింది. భారీగా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. అసలే రాజకీయ నేత కావడంతో వందల సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. వివిధ రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అతిథులంతా సంతోషంగా భోజనం చేశారు. ఇంటికి వెళ్లిన వారంతా.. పెళ్లిలో భోజనాలు తదితర ఏర్పాట్ల గురించి అందరికీ గొప్పగా చెప్పుకొన్నారు. అయితే రాత్రి సమయంలో వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడ్డారు. ఎంతకీ తగ్గకపోవడంతో మరుసటి రోజు అందరినీ వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు.

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..


సుమారు 1200మంది డయేరియా, వాంతులతో అవస్థలు పడ్డారు. కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నా.. మరికొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ పాయిజన్ అవడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

ఊర్లోకి చొరబడ్డ చిరుత పులి.. దాడి చేసి రేకుల షెడ్డుపై మాటు వేయడంతో.. పరుగులు తీసిన గ్రామస్తులు.. చివరకు..

Updated Date - 2022-03-06T23:34:34+05:30 IST