Tailor Kanhaiya Lal హత్య కేసు... కోర్టుకు ఏడుగురు నిందితులు...
ABN , First Publish Date - 2022-07-12T16:58:05+05:30 IST
రాజస్థాన్ (Rajastan)లోని ఉదయ్పూర్లో దర్జీ కన్హయ్య
జైపూర్ : రాజస్థాన్ (Rajastan)లోని ఉదయ్పూర్లో దర్జీ కన్హయ్య లాల్ హత్య కేసులో ఏడుగురు నిందితులను జైపూర్లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టులో మంగళవారం హాజరుపరుస్తారు. వీరికి కోర్టు విధించిన ఎన్ఐఏ కస్టడీ మంగళవారంతో ముగుస్తుంది. కన్హయ్య లాల్ జూన్ 28న హత్యకు గురైన సంగతి తెలిసిందే.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీపీ శర్మ మాట్లాడుతూ, నిందితులను జూలై 12 వరకు ఎన్ఐఏ (NIA) కస్టడీకి కోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ కేసులో నిందితులందరినీ (ఏడుగురిని) మంగళవారం కోర్టుకు హాజరుపరుస్తారని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టినందుకు కన్హయ్యలాల్ (Kanhaiya Lal)ను రియాజ్ అక్తరి (Riaz Akhtari), గౌస్ మహమ్మద్ (Ghouse Mohammad) హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఉదయ్పూర్ (Udaipur)లోని ధన్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆయన టైలరింగ్ దుకాణంలోనే జూన్ 28న ఆయనను దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన అత్యంత భయానక వీడియోలను నిందితులు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అక్తరి, మహమ్మద్లను ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రాజ్సమంద్లో అరెస్టు చేశారు. జూన్ 30 రాత్రి మొహిసిన్, అసిఫ్లను అరెస్టు చేశారు. వీరు ఈ కుట్రలో భాగస్వాములని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. కన్హయ్య లాల్ దుకాణం వద్ద వీరు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత మహమ్మద్ మొహిసిన్, వసీం అలీ, పర్హాద్ మహమ్మద్ షేక్లను వేర్వేరుగా అరెస్టు చేశారు. వీరందరినీ వేర్వేరుగా కోర్టులో హాజరుపరిచారు. వీరందరినీ జూలై 12 వరకు తమకు అప్పగించాలని ఎన్ఐఏ కోరింది.