స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-08-15T04:37:44+05:30 IST
రాయచోటి జిల్లా కేంద్రంలో 76వ భారత స్వాతంత్య్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 8.35 నుంచి ప్రారంభం
ముఖ్య అతిథిగా పాల్గొననున్న జిల్లా ఇన్చార్జి మంత్రి
రాయచోటి (కలెక్టరేట్), ఆగస్టు 14: రాయచోటి జిల్లా కేంద్రంలో 76వ భారత స్వాతంత్య్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 8.35 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, కవాతు పరిశీలన, మార్చ్ఫాస్ట్ ఉంటాయన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సందేశానంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాల ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.
ఏర్పాట్ల పరిశీలన
రాయచోటి టౌన్, ఆగస్టు 14: స్వాతంత్ర వేడుకలకు నూతనంగా ఏర్పడ్డ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పేరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ఆదివారం కలెక్టర్ పీఎస్ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్రాజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రౌండ్లో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని, జిల్లా నలుమూలల నుంచి వచ్చే అన్ని శాఖల అధికారులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.