ప్రసన్నరాణికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం

ABN , First Publish Date - 2021-09-18T03:41:13+05:30 IST

కావలి పట్టణంలోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ ప్రసన్నరాణి పట్ల వైసీపీ చోటా నేత వేమిరెడ్డి విజయకుమార్‌రెడ్డి పాల్పడిన అరాచకాలను ఖండిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు.

ప్రసన్నరాణికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
మాట్లాడుతున్న అఖిలపక్ష నేతలు

అఖిలపక్షం నేతల స్పష్టం

కావలి, సెప్టెంబరు 17: కావలి పట్టణంలోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ ప్రసన్నరాణి పట్ల వైసీపీ చోటా నేత వేమిరెడ్డి విజయకుమార్‌రెడ్డి పాల్పడిన అరాచకాలను ఖండిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. కావలి జర్నలిస్ట్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల పక్షం నేతలు చింతాల వెంకట్రావు, దామా అంకయ్య, జ్యోతి బాబూరావు, పెంచలయ్య, కరువాది భాస్కర్‌, డేగా సత్యం, గంగినేని వెంకటేశ్వర్లు, పంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ ప్రసన్నరాణికి న్యాయం జరిగేవరకు పోరాడుతుందన్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా తన తల్లి వద్ద ఉంటుండగా తల్లి ఇంట్లో ఒక పోర్షన్‌ను అద్దెకు తీసుకున్న వైసీపీ చోటా నాయకుడు అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే దానిని ప్రశ్నించి ఇల్లు ఖాళీ చేయించినందుకు ఆమెపై కక్ష పెట్టుకుని ఒంటరి మహిళ పింఛన్‌ను  నిలుపుదల చేయించటం ఏమిటని ప్రశ్నించారు. అలాగే కాపు నేస్తం రానివ్వకుండా చేసి ఆమెపైనే వలంటీర్‌తో కేసు పెట్టించి భయబ్రాంతులకు గురిచేస్తుంటే పోలీసులు ఆమెతో తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని బైండోవర్‌ చేయడం సిగ్గు చేటన్నారు. మహిళల భద్రత కోసం ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశా యాప్‌ ఎంత మంది మహిళలకు రక్షణ కల్పించిందో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే వైసీపీ నేతల అరాచకాలను ప్రోత్సహిస్తుంటే అఖిల పక్షం చూస్తూ ఊరుకోదని ప్రజా క్షేత్రంలో వారి చర్యలను ఎండగడుతోందన్నారు.

Updated Date - 2021-09-18T03:41:13+05:30 IST