మోదీ లేకుండానే అఖిల పక్ష సమావేశం

ABN , First Publish Date - 2021-11-28T21:32:12+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముం

మోదీ లేకుండానే అఖిల పక్ష సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనలేదు. ప్రభుత్వంవైపు నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయన్న సంగతి తెలిసిందే. 


రాజ్య సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొని, ఏదైనా సమాచారాన్ని తమతో పంచుకుంటారని తాము భావించామని చెప్పారు. మూడు సాగు చట్టాల రద్దు గురించి మరిన్ని వివరాలు అడగాలని తాము అనుకున్నామని, ఈ చట్టాలను వేరొక రూపంలో మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందనే భయాందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. 


సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పెట్రోలు ధరల పెరుగుదల, చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను ప్రస్తావించింది. 


వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం చట్టబద్ధ తీర్మానాన్ని తేవడం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వైకాపా కోరింది. 


పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, ఈ సమావేశంలో 31 పార్టీల నేతలు పాల్గొన్నట్లు తెలిపారు. అఖిల పక్ష సమావేశానికి ప్రధాన మంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదన్నారు. ఈ సంప్రదాయాన్ని నరేంద్ర మోదీయే ప్రారంభించారన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి మోదీ హాజరుకాలేకపోయారని తెలిపారు. 


పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబరు 23 వరకు జరుగుతాయి. 

Updated Date - 2021-11-28T21:32:12+05:30 IST