Engineering సిలబస్లో సమూల మార్పులు!
ABN , First Publish Date - 2022-08-13T16:53:57+05:30 IST
ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్(Syllabus of Engineering Courses)లో సమూలంగా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ పూర్తిచేసినట్టు తెలిసింది. త్వరలోనే
ఉపాధి కల్పించే అంశాలకు చోటు
ఇంటర్న్షిప్లకు మరింత ప్రాధాన్యం
మల్టిపుల్ ఎగ్జిట్కు అవకాశం
త్వరలో అధికారికంగా వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్(Syllabus of Engineering Courses)లో సమూలంగా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ పూర్తిచేసినట్టు తెలిసింది. త్వరలోనే కొత్త సిలబస్(New Syllabus)ను ప్రకటించనున్నారు. వారం పది రోజుల్లో దీన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబ్సలో మార్పులు చేసినట్టు సమాచారం. ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించారు. రెండు నెలల్లో కొత్త విద్యార్థులకు తరగతులను కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కోర్సులు, సిలబ్సను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై అధికారులు ఇప్పటికే అనేకసార్లు సమావేశమై చర్చించారు. ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(All India Council of Technical Education) (ఏఐసీటీఈ) కూడా పలు సూచనలు చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా... ఇంజనీరింగ్ కోర్సు ముగిసేనాటికి విద్యార్థులకు ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా సిలబ్సను రూపొందిస్తున్నారు. ఇంటర్న్షిప్లకు ఇప్పుడున్న దానికంటే మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే... కోర్సు మధ్యలో మానేసి, మళ్లీ చేరడానికి వీలుగా మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని కూడా అమలుచేయాలని భావిస్తున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కోర్సు చదువుతూనే...
మరో డిగ్రీ కూడా చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. అంటే... ఒక కోర్సును రెగ్యులర్గా, మరో కోర్సును ఆన్లైన్ విధానంలో చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు బీబీఏ (డేటా ఎనలిటిక్స్) డిగ్రీ కోర్సును చదువుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ కోర్సును 70 శాతం ఆన్లైన్, 30 శాతం ఆఫ్లైన్లో అందిస్తారు. అలాగే... జేఎన్టీయూ పరిధిలోని రెండు కాలేజీల్లో ఈ ఏడాది నుంచి కొత్తగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్ క్యాంప్సలలో ఈ కోర్సులను అందించనున్నారు. ఒక్కో క్యాంప్సలో 60 సీట్లు ఉంటాయి. అయితే వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. కాగా... ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేయడానికి 6వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను తనిఖీ చేయడానికి జేఎన్టీయూ మొత్తం 20 బృందాలను ఏర్పాటుచేసింది. క్లస్టర్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి, ఆయా కాలేజీలకు లెక్చరర్లను కేటాయించనున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ చొప్పున ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.