ఆశలన్నీ పూలపైనే
ABN , First Publish Date - 2022-10-03T05:03:36+05:30 IST
ఆరుగాలం కష్టపడి పూల సాగు చేసినా ఫలితం నష్టాలే వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలం నీటి ఆదరవు లేని ప్రాంతం
ఆరుగాలం కష్టపడినా నష్టాలే
లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు 2: ఆరుగాలం కష్టపడి పూల సాగు చేసినా ఫలితం నష్టాలే వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలం నీటి ఆదరవు లేని ప్రాంతం. ఈ ప్రాంతంలో వర్షాధారంతో వేరుశనగ, కంది, వరి సాగు చేసేవారు. సకాలంలో వర్షాలు కురవక, సరైన దిగుబడి రాక రైతులు నష్టాలపాలయ్యేవారు. ఈ నేపథ్యంలో దిన్నెపాడు పంచాయతీ నరసిం హరాజు గారిపల్లె, దిన్నెపాడు గ్రామాల రైతులు ఆరేళ్ల కిందట గోల్డ్ చామంతి, బుల్లెట్ చామంతి, తెల్ల చామంతి పూల తోటలు సాగు చేసి లాభాలు సాధించా రు. నరసింహరాజుగారి పల్లెలో ప్రతి రైతు ఎకరా నుంచి మూడెకరాల వరకూ పూలతోటలు సాగు చేస్తున్నారు. కరోనా కారణంగా మూడేళ్లగా సాగు ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడ్డారు. దసరాకు డిమాండ్ వస్తుందన్న ఆశతో ఈ ఖరీఫ్లో పలువురు రైతులు బుల్లెట్ చామంతి సాగు చేశారు. ప్రస్తుతం పైరుకు మంచి ధర పలుకుతుండడంతో పూలను చెన్నై మార్కెట్కు తరలిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మూడేళ్లుగా నష్టాలు ఎదుర్కొన్నామని, ఈ ఏడాదైనా లాభాలు వస్తాయని ఆశలన్నీ పూల తోటలపైనే పెట్టుకున్నామంటున్నారు. దస రా పండుగతో కనీసం కిలోకు 70 నుంచి 80 రూపాయలు ధర పలుకుతుంద ని ఆశిస్తున్నారు. దీంతో కొంత మేరకు అప్పు తీరవచ్చని ఆశిస్తున్నారు.
మూడేళ్లగా నష్టాలే
అధిక దిగుబడులు సాధించినా, కొనే వారు లేక మూడేళ్లుగా నష్టాలే వచ్చా యి. దసరా పండుగను నమ్ముకుని ఈ ఏడాది రెండెకరాల్లో సాగు చేశా. పూలుకోసి మార్కెట్కు తరలిస్తున్నాం.
- నాగరాజు, రైతు
ధర పలికితేనే లాభాలు
దసరా పండుగను నమ్ముకుని పూలు కోసి మార్కెట్కు తరలిస్తున్నాం. మా ర్కెట్లో ధర పలికితే లాభాలు వస్తా యి. లేదంటే ఈ ఏడాదీ నష్టాలే. పూల తోటలను నమ్ముకుని జీవిస్తున్నాం.
- సుబ్బరాజు, రైతు