మేడారం భక్తులకు సకల సౌకర్యాలు
ABN , First Publish Date - 2022-01-25T07:47:45+05:30 IST
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
చివరి దశలో అభివృద్ధి పనులు: సత్యవతి రాథోడ్
మేడారం/ములుగు, జనవరి 24: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్తో కలిసి మంత్రి మేడారంలో సోమవారం పర్యటించారు.
గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.21 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకు, రూ.35 లక్షలతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్, భక్తుల వసతి గృహాల్లో రూ.13 లక్షలతో నిర్మించిన వంట షెడ్లు, రూ.25 లక్షలతో నిర్మించిన పూజారుల వసతి గృహ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే రూ.25 లక్షలతో చేపట్టిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అతిథిగృహం నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ తర్వాత సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహాజాతరకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరికొన్ని చివరి దశలో ఉన్నాయని తెలిపారు. కాగా, మేడారానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు.
కాగా, మేడారం మహాజాతరకు ఈసారి కూడా తాత్కాలిక ఉత్సవ పునరుద్ధరణ కమిటీయే ఏర్పాటు కానుంది. చైర్మన్, 14 మంది డైరెక్టర్లతో కూడిన జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. నేడోరేపో ఉత్తర్వులు జారీకానున్నాయి. చైర్మన్గా తాడ్వాయి మండలం కామారానికి చెందిన కొర్నిబెల్లి శివయ్యను నియమించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన కోయ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలైన గిరిజన, గిరిజనేతరులను డైరెక్టర్లుగా నియమించారు. సోమవారం సత్యవతి రాథోడ్ మేడారంలో పర్యటించగా మంత్రి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారం ఉంటుందని సర్వత్రా భావించారు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో దేవాదాయ శాఖ నుంచి అధికారిక జీవో జారీకాలేదు. ఈనెల 29న కమిటీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.