కళ్లన్నీ భవానీపూర్పైనే!
ABN , First Publish Date - 2021-09-05T07:14:32+05:30 IST
రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల దృష్టి బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశమున్న ఆ స్థానానికి ఉపఎన్నిక...
- మమత పోటీ చేయనున్న ఆ స్థానానికి 30న ఉప ఎన్నిక
- హుజూరాబాద్ సహా 31 అసెంబ్లీ, 3 లోక్సభ
- స్థానాలకు ఉప ఎన్నికలు వాయిదా
న్యూఢిల్లీ,సెప్టెంబరు 4: రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల దృష్టి బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశమున్న ఆ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ను శనివారం జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించిం ది. భవానీపూర్ ఉప ఎన్నికను సెప్టెంబరు 30న నిర్వహించి.. అక్టోబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. బెంగాల్ లో శంషేర్గంజ్, జంగీపూర్కు.. ఒడిశాలోని పిప్లి స్థానానికి కూడా ఇదే షెడ్యూల్లో ఉపఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది. అయితే కరోనా తో తెలంగాణలోని హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ స్థానాలకు, 3 లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది.
రాజ్యాంగపరమైన ఆవశ్యకత, బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవానీపూర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. 4 నెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించినా, నందిగ్రామ్లో మమత 1956 ఓట్లతో ఓడిపోయారు. భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ నేత సోవన్దేవ్ చటోపాధ్యాయ్.. మమత పోటీ చేసేందుకు వీలుకల్పిస్తూ రాజీనామా చేశారు.