జోరుగా మద్యం

ABN , First Publish Date - 2020-07-13T11:44:45+05:30 IST

ఒక వైపు తెలంగాణ, మరో వైపు కర్ణాటక ఉన్న కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతూంటుంది.

జోరుగా మద్యం

తగ్గని నాటు సారా వ్యాపారులు

దాడులు చేస్తున్నా భారీగా తయారీ

విధులపై ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌లో అయోమయం


కర్నూలు(అర్బన్‌), జూలై 12: ఒక వైపు తెలంగాణ, మరో వైపు కర్ణాటక ఉన్న కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతూంటుంది. నాటు సారా విక్రయాలు జోరందుకున్నాయి. ఎస్‌ఈబీ తనిఖీల్లో పొరుగు మద్యం, నాటు సారా భారీగా పట్టుబడుతోంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో, పోలీసుల తనిఖీలు చేస్తున్నా సారా వ్యాపారులు తగ్గడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ధరలను అమాంతం పెంచింది. దీనికి తోడు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద నిర్దేశించిన సమయాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో మందు బాబులు నిరంతరం దొరికే సారాను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో అటు వైపే ఆసక్తి కనపరుస్తున్నారు. తెలంగాణ సరిహద్దు మండలాల నుంచి  గుట్టుగా అక్రమ మద్యం, నాటు సారా సరఫరా అవుతోంది. 


స్పష్టత కరువు

ఎన్నికల హామీల్లో భాగంగా మద్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాల నిర్వహణను ఎక్సైజ్‌కు, అక్రమ మద్యం నియంత్రణ, మద్య నిషేధం బాధ్యతలను ఎసీబీకి కట్టబెట్టింది. రెండు నెలల క్రితం ఎక్సైజ్‌కు చెందిన 70 శాతం సిబ్బందిని ఎస్‌ఈబీకి బదలాయించింది. మిగిలిన 30 శాతం మంది ఎక్సైజ్‌లోనే కొనసాగుతున్నారు. ఎస్‌ఈబీ బాధ్యతలను అదనపు ఎస్పీకి అప్పగించారు. 


జిల్లాలో 14 ఎక్సైజ్‌ పోలీస్టేషన్లను ఎస్‌ఈబీకి కిందకు చేర్చారు. 13 మంది సీఐలు, 45 మంది ఎస్‌ఐలను, వందలాది మంది సిబ్బందిని కేటాయించారు. కానీ వీరి రోజువారీ విధులపై స్పష్టత లేదు. వీరు స్థానిక పోలీసులే నాటు సారా, మద్యం కేసులపై దాడులు చేస్తుండటంతో వీరి పాత్ర నామమాత్రంగా తయారైంది. ఎస్‌ఈబీ పట్టుకున్న మద్యంపై కేసుల నమోదు గురించి కూడా స్పష్టత లేదు.


రెండు విభాగాలకు విధి విధానాలపై క్షేత్ర స్థాయి స్పష్టత కొరవడింది. రెండుగా చీలిన శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. తాము ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నామో అధికారులు, ఉద్యోగులకే స్పష్టతలేదు. ఫలితంగా ఉన్నతాధికారులు మొదలు కింది స్థాయి ఉద్యోగుల వరకూ అధిక శాతం  కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. 


శాఖ మధ్య సమన్వయ లోపాన్ని కొందరు సివిల్‌ పోలీసులు క్యాష్‌ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఈబీతో నిమిత్తం లేకుండా కొందరు దాడులకు వెళుతున్నారు. అక్రమ మద్యం వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారు. మద్యం అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డవారు అధికారుల చేతులు తడిపి దందా కొనసాగిస్తున్నారు. 


సిబ్బంది కొరత

ఎక్సైజ్‌ శాఖ విధులు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) చేతుల్లోకి వెళ్లాయి. పోలీసు, ఎక్సైజ్‌ శాఖ మధ్య సమన్వయ లోపం నెలకొంది. దీంతో దాడులు తగ్గుముఖం పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిఘా ఉన్నా, కర్నూలు, శ్రీశైలం, మంత్రాలయం, సి బెళగల్‌, నాగలదిన్నె, మంత్రాలయం, కోసిగి, ఆలూరు, హోళగుంద, డోన్‌, బనగానపల్లె, కోవెలకుంట్ల, పత్తికొండ మండలాల నుంచి జిల్లాలోకి పొరుగు రాష్ట్ర మద్యం ప్రవేశిస్తోంది. సారా నియంత్రణకు స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోను ప్రత్యేకంగా నియమించింది. వీరు సరిహద్దు మండలాల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. అయినా సారా కట్టడి కావడం లేదు.  పైగా కర్ణాటక, తెలంగాణ మద్యం బాటిళ్లు కొని తెచ్చి అమ్ముతున్నారు. 


విధి విధానాలు రావల్సి ఉంది..సి చెన్నకేశవరావు, డిప్యూటీ కమిషనర్‌, ఎస్‌ఈబీ

ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌కు సంబందించిన విధి విఽఽధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌ పరంగా జరగాల్సిన పనులకు సిబ్బంది కొనసాగుతున్నారు. ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ పర్యవేక్షణలో ఎస్‌ఈబీ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం పాలసీ విధుల్లో సిబ్బంది కొనసాగుతున్నారు.


Updated Date - 2020-07-13T11:44:45+05:30 IST