నాటుదాం..సంరక్షిద్దాం
ABN , First Publish Date - 2020-06-28T07:07:04+05:30 IST
మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు
అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం
ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 27: మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ బెటాలియన్లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, కమాండెంట్ జమీల్ బాషా హాజరయ్యారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మొక్కలను నాటి వాటిని బాధ్యతాయుతంగా పెంచాలని, అప్పుడే రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించి సమాజంలో మరో బాధ్యతను నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, అలంపూర్ సీఐ వెంకటరామయ్య, కోదండపురం ఎస్ఐ కృష్ణయ్య పాల్గొన్నారు.