అసలు నిజాన్ని బయటపెడుతున్న పోస్టల్ బ్యాలెట్లు : అఖిలేశ్ యాదవ్
ABN , First Publish Date - 2022-03-15T20:06:49+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరిగిన తీరును పోస్టల్ బ్యాలెట్లు
లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరిగిన తీరును పోస్టల్ బ్యాలెట్లు బయటపెడుతున్నాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లలో 51.5 శాతం ఓట్లు సమాజ్వాదీ పార్టీ కూటమికి లభించాయని, 304 స్థానాల్లో ఈ కూటమి విజయం సాధించినట్లు వెల్లడవుతుండటాన్నిబట్టి ఈ ఎన్నికల నిజస్వరూపం వెలుగులోకి వస్తోందని చెప్పారు.
అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో, సమాజ్వాదీ పార్టీ కూటమికి పోస్టల్ బ్యాలెట్లలో 51.5 శాతం ఓట్లు లభించాయని తెలిపారు. 304 స్థానాల్లో తమ కూటమి గెలిచిందన్నారు. దీనినిబట్టి ఈ ఎన్నికల నిజస్వరూపం వెల్లడవుతోందన్నారు. తమకు మద్దతిచ్చిన ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. మోసం చేయడం వల్ల బలం రాబోదని అధికారంలో ఉన్నవారు గుర్తించాలన్నారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడ్డాయి. సమాజ్వాదీ పార్టీ 2017, 2022 ఎన్నికల్లో వరుసగా పరాజయాలను ఎదుర్కొంది. సమాజ్వాదీ పార్టీకి 111 స్థానాలు, ఆర్ఎల్డీకి 8 స్థానాలు, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి ఆరు స్థానాలు లభించాయి.