కారు బోల్తా పడలేదు... ప్రభుత్వమే పడిపోకుండా బయటపడింది: దూబే ఎన్కౌంటర్పై అఖిలేశ్
ABN , First Publish Date - 2020-07-10T16:10:12+05:30 IST
ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు...
లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. వాస్తవానికి దూబే కారు బోల్తా పడలేదనీ.. అతడి రహస్యాల వల్ల ప్రభుత్వమే పడిపోకుండా బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. వికాస్దూబేను కాన్పూర్కి తరలిస్తుండగా కారు బోల్తా పడిందనీ.. అనంతరం అతడు ఓ గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కాల్చిచంపామని యూపీ పోలీసులు ఇవాళ ఉదయం వెల్లడించారు. అయితే గత వారం రోజులుగా జరుతున్న దూబే అనుచరుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో దీనిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు ఐదుగురు దూబే అనుచరులను ఎన్కౌంటర్ చేశారు.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ ఇవాళ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ వాస్తవానికి కారు బోల్తా పడలేదు. రహస్యాలు బయటికి వచ్చి యూపీ ప్రభుత్వం పడిపోకుండా బయటపడింది..’’ అని వ్యాఖ్యానించారు. కాగా వికాస్ దూబేను నిజంగా అరెస్ట్ చేశారో లేక తనంత తాను లొంగిపోయాడో చెప్పాలంటూ అఖిలేశ్ యాదవ్ నిన్న డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో ఎవరు కుమ్మక్కయ్యారో బయటపడేలా కాల్ రికార్డులన్నీ బహిర్గతం చేయాలని ఆయన కోరారు.