అఖిలేష్, నేను కళ్లజోడు ధరిస్తాం. కానీ..: అమిత్ షా
ABN , First Publish Date - 2022-02-21T22:52:46+05:30 IST
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కళ్లజోడు ధరిస్తారని, తాను కూడా కళ్లజోడు ధరిస్తానని అయితే ఇద్దరికీ కనిపించేది ఒకటి కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన కళ్లజోడు నుంచి చూస్తే ఏది ఉందో అందే స్పష్టంగా కనిపిస్తుందని..
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కళ్లజోడు ధరిస్తారని, తాను కూడా కళ్లజోడు ధరిస్తానని అయితే ఇద్దరికీ కనిపించేది ఒకటి కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన కళ్లజోడు నుంచి చూస్తే ఏది ఉందో అందే స్పష్టంగా కనిపిస్తుందని, కానీ అఖిలేష్ కళ్లజోడు నుంచి చూస్తే మతం, కులం కనిపిస్తాయని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సితాపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు గుప్పించారు.
‘‘సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు అధికారంలో ఉండగా రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలేది. కానీ మోదీ, యోగీల ప్రభుత్వాలు వచ్చాక పూర్తిగా మారిపోయింది. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. మాఫియాలు ఇప్పుడు యూపీకి రావాలంటే భయపడుతోంది. సీతాపూర్ ప్రజల ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకవైపు సమాజ్వాదీ పార్టీ అవినీతి దారి, మరొకవైపు బీజేపీ అభివృద్ధి దారి’’ అని అమిత్ షా అన్నారు.
ఇక అఖిలేష్ యాదవ్ గురించి మాట్లాడుతూ ‘‘అఖిలేష్ ధరించే కళ్లజోడుకు ఒక ప్రత్యేకత ఉంది. నేను కూడా కళ్లజోడు ధరిస్తాను. కానీ నాకు ఏముందో అదే కనిపిస్తుంది. అదే అఖిలేష్ కళ్లజోడు నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. పేద ప్రజలు ఆయనకు కనిపించరు. కులం, మతం లాంటివే అఖిలేష్కి కనిపిస్తాయి’’ అని అమిత్ షా విమర్శించారు.