అఖిలేష్కు ధైర్యం లేదు: కేశవ్ మౌర్య
ABN , First Publish Date - 2022-01-19T19:03:16+05:30 IST
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పుకుంటున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు...
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పుకుంటున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం మాత్రం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారంనాడు బీజేపీలో చేరిన సందర్భంగా మౌర్య మాట్లాడుతూ, సొంత కుటుంబంలో సక్సెస్ కాలేకపోయిన అఖిలేష్ యాదవ్ సీఎంగా, పార్లమెంటు సభ్యుడిగా కూడా సక్సెస్ కాలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన భయపడుతున్నారని అన్నారు. గెలుపు నల్లేరుమీద నడకలా సాగేందుకు సురక్షితమైన స్థానం కోసం చాలా కాలంగా ఆయన వెకుకుతున్నారని చెప్పారు.
''అఖిలేష్ జీ...2012 నుంచి 2017 వరకూ మీరు బాగా అభివృద్ధి చేసిన పనులేంటో చెప్పండి?. బీజేపీ చేసిన అభివృద్ధి పనులతో మీరు పోటీ పడలేరు'' అని మౌర్య అన్నారు. కాగా, సమాజ్వాదీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంతవరకూ ఆయన వెల్లడి చేయలేదు.