అకాల వర్షం.. రైతుల్లో ఆందోళన
ABN , First Publish Date - 2021-11-29T06:30:58+05:30 IST
అకాల వర్షం.. రైతుల్లో ఆందోళన
ఉయ్యూరు, నవంబరు 28 : అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటకోతకు వచ్చిన తరుణంలో అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమై రోజంతా కురుస్తున్న వర్షంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లపు పొలాల్లో ఇప్పటివరకు నీరు పోక నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో మరో వాయుగండం రైతులను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. మండల పరిధిలో 13వేల ఎకరాల్లో వరిసాగు చేయగా ఇప్పటివరకు పదిశాతం లోపే రైతులు కోతలు పూర్తిచేసి పొలంలో పనలపై ఉంచారు. పంటకోత తరుణం మించి పోతున్న పరిస్థితుల్లో విధిలేక కొందరు రైతులు కోతలు కోశారు. కాగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తొందరపడి వరికోతలు కోయవద్దని, ఇప్పటికే కోతకోసిన వారు పొలాల్లో నీరు నిల్వ కుండా చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి జీవీ శివప్రసాద్ సూచించారు.