భారత్ క్రమంగా ఎదుగుతోంది : అజిత్ దోవల్

ABN , First Publish Date - 2021-11-12T21:17:15+05:30 IST

స్వతంత్ర భారత దేశానికి వందేళ్ళు వచ్చేసరికి ఓ నవ

భారత్ క్రమంగా ఎదుగుతోంది : అజిత్ దోవల్

హైదరాబాద్ : స్వతంత్ర భారత దేశానికి వందేళ్ళు వచ్చేసరికి ఓ నవ శకం ప్రారంభమవుతుందని, అనేక విజయాలు సాధించే భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఓ ప్రధాన దేశంగా గుర్తింపు లభిస్తుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చెప్పారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. 


సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పెరేడ్‌లో దోవల్ మాట్లాడారు. ‘‘భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యేనాటికి పరిస్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేశం క్రమంగా వృద్ధి చెందుతోంది, అంతర్జాతీయ వేదికపై నూతన స్థానం సాధించిన భారత దేశ పోలీసు దళాలకు మీరే నాయకత్వం వహించడం మీరు చూస్తారు’’ అని దోవల్ చెప్పారు.


ప్రజాస్వామ్య సారం బ్యాలెట్ పెట్టెల్లో ఉండదని, ఆ బ్యాలెట్ పెట్టెల ద్వారా ఎన్నికైనవారు చేసిన చట్టాల్లో ఉంటుందని చెప్పారు. ఆ చట్టాలను అమలు చేసేవారు ఐపీఎస్ అధికారులేనని తెలిపారు. చట్టాలను ఎంత బాగా రూపొందించామన్నది ముఖ్యం కాదని, వాటిని సక్రమంగా అమలు చేయాలని, వాటి వల్ల ప్రజలకు అందే సేవలే ముఖ్యమని అన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేయడమే ముఖ్యమన్నారు. ఏ దేశంలోనైనా చట్ట నియమాలు విఫలమైతే, ఆ దేశ నిర్మాణం సాధ్యం కాదన్నారు. చట్టాన్ని అమలు చేసేవారు బలహీనులు, అవినీతిపరులు, పక్షపాతంతో వ్యవహరించేవారు అయితే తమకు భద్రత, రక్షణ ఉన్నట్లు ప్రజలు భావించలేరన్నారు. పోలీసులు ఇతర వ్యవస్థలతో కలిసి సన్నిహితంగా పని చేయాలని,  దేశానికి సేవ చేయాలనే మానసిక వైఖరి అవసరమని చెప్పారు. దేశ సరిహద్దుల నిర్వహణ బాధ్యత కూడా పోలీసులకు ఉందన్నారు. 15 వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో చాలా వరకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయన్నారు. పాకిస్థాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లతో మన దేశ సరిహద్దుల్లో రకరకాల భద్రతా సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఈ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర పోలీసు ఆర్గనైజేషన్లు సేవలందిస్తున్నాయన్నారు.


Updated Date - 2021-11-12T21:17:15+05:30 IST