కివీస్పై టెస్టుల్లో గెలవాలంటే ఎన్ని పరుగులు చేయాలో చెప్పిన రహానె
ABN , First Publish Date - 2020-02-21T03:20:32+05:30 IST
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడి బేసిన్ రిజర్వు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడి బేసిన్ రిజర్వు మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ.. కివీస్పై గెలిచేందుకు 320కిపైగా పరుగులు చేసి, బౌలింగ్లో సత్తా చాటితే సరిపోతుందని అంచనా వేశాడు. భారత్కు బయట 320 పరుగులు అంటే మంచి స్కోరేనని, ఆస్ట్రేలియాలోను, ఇంగ్లండ్లోనూ అదే స్కోరుతో విజయాలు సాధించామని గుర్తు చేశాడు.
బౌలర్లు 20 వికెట్లు తీస్తామన్న నమ్మకంతో బరిలోకి దిగితే సరిపోతుందని పేర్కొన్న రహానె.. తాము ఎక్కడ ఆడినా సొంత మైదానంగానే భావిస్తామని అన్నాడు. 2014లో తాను ఇదే మైదానంలో తొలి సెంచరీ నమోదు చేశానని గుర్తు చేసుకున్నాడు. కివీస్ పిచ్లు రెండో రోజు తర్వాత బ్యాటింగ్కు అనుకూలంగా మారుతాయని, కాబట్టి అప్పుడు స్పిన్నర్ల అవసరం ఉంటుందన్నాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్, జడేజాల్లో ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమని రహానె పేర్కొన్నాడు.