Kamakhya temple కోసం ఔరంగజేబు భూములు విరాళంగా ఇచ్చాడు

ABN , First Publish Date - 2021-12-08T13:09:12+05:30 IST

గౌహతిలోని ప్రఖ్యాత శక్తిపీఠ్ మా కామాఖ్య దేవాలయం కోసం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భూములను విరాళంగా ఇచ్చారని...

Kamakhya temple కోసం ఔరంగజేబు భూములు విరాళంగా ఇచ్చాడు

అసోం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

గౌహతి(అసోం): గౌహతిలోని ప్రఖ్యాత శక్తిపీఠ్ మా కామాఖ్య దేవాలయం కోసం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భూములను విరాళంగా ఇచ్చారని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటనతో అసోంలో వివాదం చెలరేగింది.హిందువులపై క్రూరత్వానికి, హిందూ దేవాలయాలపై దాడులకు ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అసోం రాష్ట్ర రాజధానిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చాడని ధింగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం చెప్పారు.


‘‘ఔరంగజేబు భారతదేశంలోని అనేక వందల దేవాలయాలకు భూములు ఇచ్చాడు, వారణాసిలోని జంగంవాడి ఆలయానికి 178 హెక్టార్ల భూమిని విరాళంగా ఇచ్చాడు. కామాఖ్య ఆలయానికి ఔరంగజేబు ఇచ్చిన భూమిని ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు’’ అని అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు.ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ, తమ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ప్రకటనలను సహించబోమన్నారు.


‘‘ఎమ్మెల్యే షెర్మాన్ అలీ ఇప్పుడు జైలులో ఉన్నారు. మరోసారి ఇలాంటి ప్రకటనలు చేస్తే అమీనుల్ ఇస్లాం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నా ప్రభుత్వ హయాంలో మన నాగరికత, సంస్కృతికి వ్యతిరేకంగా చేసే ప్రకటనలను సహించం. అతను బయట ఉండాలనుకుంటే,  మమ్మల్ని విమర్శించవచ్చు కాని కామాఖ్య, శంకర్‌దేవ్, బుద్ధుడు, మహావీర్ జైన్, మహ్మద్ ప్రవక్తలను కూడా ఎవరూ వివాదాల్లోకి లాగకూడదు’’ అని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.కాగా ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలపై కుటుంబ సురక్ష మిషన్ అనే హిందూ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Updated Date - 2021-12-08T13:09:12+05:30 IST